ప్రభుత్వం చెబుతున్నట్టుగా సచివాలయాల వద్ద కొనుగోళ్లు జరగడంలేదు: లోకేశ్

  • ఉల్లిరైతులను ఆదుకోవాలన్న లోకేశ్
  • మద్దతు ధర లేదని వెల్లడి
  • ఉల్లిరైతుకు కన్నీరే మిగిలిందని ఆవేదన
రాష్ట్రంలో ఉల్లి రైతులను ఆదుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఉల్లిపంటకు మద్దతు ధర లభించక రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఏపీలో ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు 34 లక్షల క్వింటాళ్ల ఉల్లి దిగుబడి వస్తోందని, అయితే ఉల్లిసాగు చేసిన రైతులు పంటను కొనేవాళ్లు లేక, సరైన మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఎకరాకు రూ.80 వేల వరకు ఖర్చు చేసి ఉల్లిపంట వేసిన రైతులకు కంట కన్నీరే మిగిలిందని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఉల్లిపంటల అమ్మకాలకు ప్రధాన మార్కెట్ కేంద్రమైన కర్నూలు మార్కెట్ యార్డు కరోనా తీవ్రత కారణంగా మూతపడిందని, ప్రభుత్వం చెబుతున్నట్టుగా సచివాలయాల వద్ద కొనుగోళ్లు జరగడంలేదని వెల్లడించారు. రాష్ట్ర సర్కారు వెంటనే స్పందించి ఉల్లిపంటలను రైతుల వద్ద నుండి వారి గ్రామంలో కొనుగోలు చేయాలని, మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Nara Lokesh
Onion Farmers
Support Price
Corona Virus
Andhra Pradesh

More Telugu News